NTR Bharosa Pensions: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల జోష్
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:46 AM
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా నెలనెలా పెన్షన్లు అందుకునే వివిధ వర్గాల ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా నెలనెలా పెన్షన్లు అందుకునే వివిధ వర్గాల ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ను ఒకరోజు ముందుగానే అందించింది. వాస్తవానికి గురువారం (జనవరి 1న) ఇవ్వాల్సిన ఈ పింఛన్లను.. ఆ రోజు సెలవు కావడంతో ఒక రోజు ముందే బుధవారం పంపిణీ చేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 93.27 శాతం మంది లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 63.12 లక్షల పెన్షన్లకు గాను బుధవారం ఒక్క రోజే 58.87 లక్షల మందికి పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం పెన్షన్లు తీసుకోలేని లబ్ధిదారులకు రెండో తేదీన అందించనున్నారు.
లబ్ధిదారులకు సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు
పింఛన్లు అందుకున్న లక్షలాది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ.. ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.