PCB Chairman Krishnaiah: భోగి మంటల్లో కాలుష్య కారక వ్యర్థాలు వేయొద్దు
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:23 AM
భోగి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య సూచించారు.
పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సూచన
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): భోగి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య సూచించారు. భోగి మంటల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు, ప్రమాదకరమైన రబ్బర్, ఎలక్ర్టానిక్, రసాయన పూతలున్న వస్తువులను వేయొద్దని కోరారు. ‘తెలిసీ, తెలియక భోగి మంటల్లో టైర్లు, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ వస్తువులు, రంగులేసిన పర్నిచర్, నిరుపయోగమైన ఎలక్ర్టానిక్ వస్తువులు వేస్తుంటారు. వాటిని కాల్చినప్పుడు డయాక్సిన్లు, ఫ్యూరాన్లు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సీసం క్యాడ్మియం, మెర్క్యురీ వంటి విష వాయువులు వాతావరణంలోకి చేరతాయి. ఫలితంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ప్రమాదకరమైన విష వాయువులతో ప్రాణాంతకమైన వ్యాధుల ముప్పు ఉంటుంది’ అని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.