జగన్ డీఎన్ఏలోనే క్రెడిట్ చోరీ
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:19 AM
క్రెడిట్ చోరీ వైఎస్ జగన్ డీఎన్ఏలోనే ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
గూగుల్ సెంటర్ ఏర్పాటు ప్రారంభం చరిత్రాత్మక ఘట్టం: మంత్రి పయ్యావుల
అనంతపురం క్రైం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): క్రెడిట్ చోరీ వైఎస్ జగన్ డీఎన్ఏలోనే ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గూగుల్ విషయంలో మొదటి రోజు తనకు సంబంధం లేదని, రెండో రోజు ఇదీ నాదే, అదీ నాదే అని చెప్పుకుని క్రెడిట్ చోరీ చేయాలని చూశారు. గూగుల్ను ఆయన తెచ్చి ఉంటే ఎందుకు ప్రారంభించలేకపోయారు? ఎందుకు ప్రోగ్రెస్ చూపించలేకపోయారు? ఐదేళ్ల పాలనలో ఏపీ నుంచి పరిశ్రమలను తరిమేసిన జగన్ను ఎవరూ నమ్మేస్థితిలో లేరు. ఆయన అనేక రకాలుగా వేధించినందుకే అమరరాజా కంపెనీ హైదరాబాద్కు వెళ్లింది. ఆ కంపెనీ తరలిపోవడం వల్ల గ్రామీణ ప్రాంత యువత 18 వేల ఉద్యోగాలు కోల్పోయింది. ఏపీలో ఉన్న కంపెనీలను తరిమేసి, వచ్చే కంపెనీలను తానే తెచ్చానని జగన్ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టం. భవిష్యత్తు తరాలు అద్భుతమైన ఫలితాలు పొందే రోజులు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షలు ఉద్యోగాల కల్పన కోసం, ఆ దిశగా ఎకో-సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి కేశవ్ అన్నారు.