Share News

పట్టిసీమతో ఐదేళ్లలో 50,000 కోట్ల సంపద

ABN , Publish Date - May 19 , 2026 | 06:28 AM

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఐదేళ్లలో రూ.50,000 కోట్ల సంపద సృష్టించిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

పట్టిసీమతో ఐదేళ్లలో 50,000 కోట్ల సంపద

  • నాడు 1300 కోట్లతో ఎత్తిపోతల పథకం పూర్తి

  • నదుల అనుసంధానానికి కేఎల్‌ రావు ఆద్యుడు

  • ఆయన వర్ధంతి సందర్భంగా నిమ్మల నివాళి

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఐదేళ్లలో రూ.50,000 కోట్ల సంపద సృష్టించిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని తన చాంబరులో ఇంజనీరింగ్‌ నిపుణుడు కేఎల్‌ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నదుల అనుసంధానానికి కేఎల్‌ రావు ఆద్యుడని నిమ్మల ప్రశంసించారు. హిరాకుడ్‌, భాక్రానంగల్‌ వంటి ఆధునిక దేవాలయాలైన అనకట్టలను కట్టి దేశ చరితను మార్చేశారని ప్రశంసించారు. ఈ రోజు నదుల అనుసంధానం గురించి అందరూ మాట్లాడుకుంటున్నామని, కానీ దేశంలో మొదటిసారిగా నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాల గురించి ఆనాడే ప్రజలను చైతన్యవంతులను చేశారని వెల్లడించారు. అందుకే కేఎల్‌రావు జాతికి స్ఫూర్తి అని కొనియాడారు. దేశంలో కరువు కాటకాలు పోవాలంటే నదుల అనుసంధానం జరగాల్సిందేనని ఆయన సూచించారని పేర్కొన్నారు. గంగా, మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానంతో కరువును రూపుమాపేందుకు సాధ్యమవుతుందని ప్రతిపాదించారని వెల్లడించారు. దేశాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని నిమ్మల చెప్పారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రూ.1300 కోట్లతో చంద్రబాబు పూర్తి చేశారన్నారు. ఈ పథకం వృథా అని ప్రతిపక్షనేత హోదాలో, తర్వాత ముఖ్యమంత్రి హోదా లో జగన్‌ విమర్శించారని అన్నారు.

Updated Date - May 19 , 2026 | 06:28 AM