పరీక్షల సమయంలో క్రికెట్ సెలెక్షన్లా..?
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:18 AM
పరీక్షల సమయమైన మార్చి నెలలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సెలెక్షన్లు నిర్వహిస్తుడటం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జూలై, ఆగస్టుల్లో.. ఇప్పుడూ అలా ఉండేటట్టు చూడండి
సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్కు విద్యార్థుల తల్లిదండ్రుల వినతి
అనంతపురం క్లాక్టవర్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పరీక్షల సమయమైన మార్చి నెలలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సెలెక్షన్లు నిర్వహిస్తుడటం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్చి నెలలో క్రికెట్ సీజన్ ప్రారంభించాలని ఏసీఏ నిర్ణయించిందని, ఎప్పటిలాగే జూలై, ఆగస్టు నెలల్లో దానిని ప్రారంభించేలా చూడాలని మంత్రి లోకేశ్కు వారు కోరారు. మంత్రి లోకేశ్కు ట్యాగ్ చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. సాధారణంగా ఏటా క్రికెట్తో పాటు ఇతర క్రీడల సెలెక్షన్లను జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ప్రారంభించేవారు. అయితే ఈ ఏడాది ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)ను ఆగస్టులో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలుంటాయి. ఒకే సమయంలో అటు పరీక్షలు, ఇటు క్రికెట్ అంటే వారు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోకేశ్ జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నారు.