మైనింగ్ సర్వేయర్ ఆస్తులు కోట్లలో..!
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:37 AM
ఒంగోలు భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శాఖలో పనిచేస్తున్న సర్వేయర్ షేక్ అబ్దుల్ ఆసిఫ్కు..
ఒంగోలు భూగర్భ గనుల శాఖలో ఏసీబీ సోదాలు
పెద్ద మొత్తంలో ఆస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం
ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శాఖలో పనిచేస్తున్న సర్వేయర్ షేక్ అబ్దుల్ ఆసిఫ్కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈమేరకు నెల్లూరు ఏసీబీ అధికారులు ఆసి్ఫపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆసి్ఫకు సంబంధించి విజయవాడ, గుంటూరు, సొంతూరు మార్కాపురం, అత్తగారి ఇల్లు కనిగిరితోపాటు ఆయన పనిచేస్తున్న ఒంగోలు మైనింగ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఉదయం ఏసీబీ ప్రత్యేక బృందం ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఆశ్రమం వద్ద ఉన్న మైనింగ్ కార్యాలయంపై ఆకస్మికంగా దాడిచేసి ఆసి్ఫను అదుపులోకి తీసుకుంది. విజయవాడలోని ఇంటికి తీసుకెళ్లి సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీఎత్తున బంగారం, వెండి, విలువైన ఆస్తిపత్రాలు లభించినట్లు సమాచారం. వాటి విలువ కోట్లల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు మైనింగ్ కార్యాలయానికి ఏడాదిన్నర క్రితం ఆసిఫ్ నెల్లూరు నుంచి బదిలీపై వచ్చారు. అప్పటినుంచి జరిగిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒంగోలులో ఏసీబీ ఇన్స్పెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. మార్కాపురానికి చెందిన ఆసిఫ్ 2013లో సర్వేయర్గా చేరారు. సోదాలలో లభ్యమైన డాక్యుమెంట్ల ప్రకారం.. రెండు ఇళ్లు, ఒక ఇంటిస్థలం, 22 ఎకరాల పొలం, 620 గ్రా. బంగారం, 500గ్రా. వెండి, రూ.2,82,264 నగదు, రూ.3,54,000 ప్రామిసరీ నోటు, 16 చేతి గడియారాలు, బైక్, విలువైన గృహోపకరణాలు, హెచ్డీఎ్ఫసీలో రూ.15లక్షల పాలసీ, టయోటో హైరైడర్ కారు కొనేందుకు రూ.20వేల అడ్యాన్స్ ఇచ్చిన రసీదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంకు లాకర్ తెరవాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అబ్దుల్ ఆసి్ఫను అరెస్టు చేశారు.