భార్య చూస్తుండగానే కుప్పకూలి..
ABN , Publish Date - May 01 , 2026 | 04:11 AM
భార్యభర్తలు కలిసి పొలంలో పని చేస్తుండగా భర్త వడదెబ్బకు గురై హఠాన్మరణం చెందాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూర్కు చెందిన షేక్ మైసూర్...
పొలంలో పనిచేస్తూ వడదెబ్బకు గురై రైతు మృతి
గనిఆత్కూర్లో హృదయవిదారక ఘటన
కంచికచర్ల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): భార్యభర్తలు కలిసి పొలంలో పని చేస్తుండగా భర్త వడదెబ్బకు గురై హఠాన్మరణం చెందాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూర్కు చెందిన షేక్ మైసూర్ (58), జానీబేగం దంపతులు. సొంతంగా అరెకరం భూమి ఉండగా, మూడెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశారు. గురువారం మిషన్తో పంట నూర్పిడి చేయిస్తున్నారు. గాలులకు నేలవాలిన మొక్కజొన్న మిషన్కు పూర్తిగా రాకపోవటంతో మిగిలిపోయిన కంకులను భార్యాభర్తలు ఏరుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మైసూర్ ఒక్కసారిగా పడిపోయాడు. ఏం జరిగిందో అర్థంకాక జానీబేగం కేకలు వేసింది. ఆ సమయానికి అటుగా వెళ్తున్న జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మెరకొండ ఏడుకొండలు గమనించి అపస్మారకస్థితిలో ఉన్న మైసూర్ను కంచికచర్లలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.