ఢిల్లీలో దొరికిన సాదిక్?
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:28 AM
పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్మ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది.
పోలీసుల అదుపులో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్మ కేసు నిందితుడు
సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే చాన్స్!
కాకినాడ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్మ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. గత కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నూకరాజు తన భార్య, కుమార్తె, మనవడితో సహా గత ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్కం రైలు బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకిన సంగతి తెలిసిందే. ఇది తెలిసిన తర్వాత సాదిక్ వెంటనే పరారయ్యారు. మొబైల్ ఫోన్ వాడకుండా ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సాదిక్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని పట్టుకునేందుకు కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి పది ప్రత్యేక బృందాలు వెళ్లాయి. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబయి, ఢిల్లీలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆరు రోజులుగా అణువణువూ గాలించాయి. ఈ క్రమంలో నిందితుడు ఢిల్లీలో పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. సాదిక్ను అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చి.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అయితే సాదిక్ను పోలీసులే వెతికి పట్టుకున్నారా? లేదా కొందరు ముస్లిం మతపెద్దల సూచనల మేరకు అతడే పట్టుబడ్డాడా? అనే విషయంపై స్పష్టత లేదు. ఢిల్లీ నుంచి ఇక్కడకు తీసుకువచ్చేందుకు 24 గంటల సమయం పట్టనున్నట్టు తెలిసింది. కాగా, నూకరాజు కుటుంబం ద్వారా లేదా వేరెవరి ద్వారా అయినా కానీ.. సాదిక్ ఖాన్ భారీ ఎత్తున సొమ్ములు, ఆస్తులు కూడబెట్టినట్టు తెలిసింది. వాటిని తెలివిగా తమ సోదరీమణుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్టు చెప్తున్నారు. సుమారు రూ.10 కోట్ల మేర విలువైన ఆస్తులు, కార్లు అతడి వద్ద ఉన్నట్టు తెలిసింది.
షూటర్ కాదు.. ఛీటర్!
సాదిక్ ఖాన్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘సాదిక్ ఖాన్ రైఫిల్ షూటరే కాదు.. అతడికి ఏమీ రాదు.. పూర్తిగా ఫేక్.. పెద్ద మోసగాడు.. అందరితోనూ గొడవలే.. దూకుడు స్వభావం.. మాటలతో మోసం చేసే తత్వం’’.. అని అతని గురించి తెలిసిన వారు చెబుతున్నారు. గతంలో అతడు పనిచేసే ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో కొందరిని వేధింపులకు గురిచేస్తే.. ఆ స్కూల్ నుంచి బయటకు పంపేశారని కూడా తెలిసింది. ఇటీవల కాకినాడలో ఓ ఫ్లాట్ కొనేందుకు రూ.25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఆ సమయంలో అతడి వెంట ఎవరైనా ఉన్నారా? వంటి విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోజున సాదిక్ తనకు బాగా పరిచయం ఉన్న ఓ న్యాయవాదికి ఫోన్ చేసినట్టు గుర్తించినట్టు తెలిసింది. ఆ రోజు సాధిక్ కాల్ డేటాలో కొంత మంది ప్రముఖుల ఫోన్ నంబర్లు ఉన్నట్టు తెలిసింది. నిందితుడితో ఉన్న సంబంధాలపై వారందరినీ విచారిస్తున్నారు.
సర్టిఫికెట్లు సైతం ఫేక్..
సాధిక్ అంత పెద్ద షూటరేమీ కాదని, రైఫిల్ షూటింగ్లో అతడి ప్రతిభ అంతంత మాత్రమేనని తెలుస్తోంది. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో కొన్ని నెలలు శిక్షణకు వెళ్లాడని, అక్కడ కూడా కొందరితో దురుసుగా ప్రవర్తించినట్టు చెప్తున్నారు. అతడు పొందిన సర్టిఫికెట్లు సైతం ఫేక్ అని, అతడు నిర్వహించే ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీకి ఎటువంటి అనుమతులు, గుర్తింపులు లేవని అంటున్నారు.
తల్లిని కాపాడే ప్రయత్నం..
నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన రోజున కార్తికేయ, అతడి తల్లి సౌజన్య కొంతసేపు మాట్లాడుకున్నట్టుగా తెలిసింది. స్విమ్మింగ్లో ఆరితేరిన కార్తికేయ తన ప్రాణాలను కాపాడుకునేందుకు నది మధ్యలో కొన్ని గంటల పాటు ఈత కొట్టి ఒడ్డుకు చేరడమే కాదు.. అతడి తల్లిని కూడా రక్షించేందుకు శ్రమించాడని, ఆ సమయంలో సౌజన్య తన కుమారుడిని నాన్మమ్మ వద్దకు వెళ్లాలని చెప్పినట్టుగా అంటున్నారు.