రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదు
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:00 AM
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఇంధన కొరత అంటూ ప్రచారం చేస్తుండటంతో భయంతో కొన్ని చోట్ల ప్రజలు బంకులకు క్యూ కడుతున్నారు.
ప్యానిక్తో బంకులకు క్యూలు : డీలర్ల సంఘం
(ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్వర్క్)
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఇంధన కొరత అంటూ ప్రచారం చేస్తుండటంతో భయంతో కొన్ని చోట్ల ప్రజలు బంకులకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో 5 వేల పెట్రోల్ బంకులు ఉండగా, వాటిల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రో డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. అయితే వదంతులతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో కొన్ని చోట్ల సమస్య వస్తోందని చెప్పారు. మరోపక్క ఆయిల్ కంపెనీలు పెట్రోలు డెలివరీ నిబంధనలు మార్చడం వల్ల కొన్ని బంకులకు ఇబ్బంది వచ్చింది. సాధారణ రోజుల్లో ఆయిల్ కంపెనీలు పెట్రోలు బంక్ల నిర్వాహకులకు క్రెడిట్ ఇచ్చేవి. ముందు డబ్బు కట్టకపోయినా లోడులను పంపించేసేవి. కానీ ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ సమస్యతో ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడంలేదు. దీంతో ముందుగా మొత్తం డబ్బు కట్టిన బంకుల యజమానులే లోడ్లు తెచ్చుకుంటున్నారు. అలా కట్టలేని వారు.. డబ్బు సర్దుబాటు అయ్యేవరకూ నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఇది తెలియని కొందరు పెట్రోల్ కొరత అంటూ ప్రచారం చేస్తున్నారు. మరో సమస్య కూడా ఉందని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. స్టోరేజ్ కెపాసిటీలో 40శాతం ఖాళీ అయితేనే ఆయిల్ కంపెనీలు బంక్లకు లోడ్లు ఇస్తున్నాయి. బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి కంపెనీలు మాత్రం నెమ్మదిగా డెలివరీ చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.