పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్ఐవో
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:37 AM
దేశ తూర్పు తీర ప్రాంతంలో సముద్ర పరిశోధనలను మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన షోర్ బేస్డ్ లేబొరేటరీ దోహదం చేస్తుందని కేంద్ర సైన్స్....
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్
సాగర్నగర్ (విశాఖపట్నం), జనవరి 30(ఆంధ్రజ్యోతి): దేశ తూర్పు తీర ప్రాంతంలో సముద్ర పరిశోధనలను మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన షోర్ బేస్డ్ లేబొరేటరీ దోహదం చేస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. బీచ్రోడ్డులో సాగర్నగర్ సమీపాన రాడిసన్ బ్లూ హోటల్ ఎదురుగా జాతీయ సముద్ర పరిశోధన సంస్థ (ఎన్ఐవో) కార్యాలయం, ప్రయోగశాల కోసం నిర్మించిన భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్, ఆయిల్ ఇండియా వంటి సంస్థలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఎన్ఐఓ లేబొరేటరీ అందిస్తుంది. అలాగే ఫార్మా, స్టీల్, థర్మల్ పవర్, ఓడరేవుల అభివృద్ధిలో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు తోడ్పాటునందిస్తుంది. తుఫాన్ల గమనాన్ని అంచనా వేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారిస్తుంది. సముద్ర అధ్యయన రంగంలో యువ శాస్త్ర వేత్తలకు, నిపుణులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అని అన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎంపీ ఎంశ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎన్ఐఓ డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్కుమార్ సింగ్ తదితరులు ప్రసంగించారు.