భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నదే మా లక్ష్యం!
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:58 AM
‘భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అందుకే గజ్వా-ఏ-హింద్(భారత్పై యుద్ధం) మొదలు పెట్టాం. ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్(ఏక్యూఐఎస్), ఐఎస్తో సంబంధాలు కొనసాగించాం.
అందుకే గజ్వా-ఏ-హింద్ మొదలు పెట్టాం
అల్ఖైదా, ఐఎస్తో సంబంధాలు
అఫ్ఘాన్వాసి హకీం షుకూర్ మార్గదర్శి
స్లీపర్ సెల్స్తో కలిపిస్తానన్నాడు
‘బెన్ ఎక్స్’ సభ్యులు వెల్లడించిన సంచలన విషయాలు
అమరావతి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ‘భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అందుకే గజ్వా-ఏ-హింద్(భారత్పై యుద్ధం) మొదలు పెట్టాం. ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్(ఏక్యూఐఎస్), ఐఎస్తో సంబంధాలు కొనసాగించాం. ఆ దారి మాకు చూపించింది అల్ హకీం షుకూర్’ అని విజయవాడ ఉగ్రలింకుల కేసులో అరెస్టైన నిందితులు పోలీసు కస్టడీలో వెల్లడించినట్లు తెలిసింది. వారు సంచలన విషయాలు చెప్పినట్టు సమాచారం. ‘ఈ దేశ జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండా పెట్టడం, ఏ నేషన్ లెడ్ బై మహమ్మద్ విల్ నాట్ సరెండర్ అని పెట్టి ఓ వర్గం యువతలో భావజాలాన్ని నింపే ప్రయత్నం చేశాం. ఇస్లామ్ను విశ్వసించని వారిపై సోషల్ మీడియా ద్వారా విషం చిమ్మాం. షుకూర్ జీహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించే పని మాకప్పగించాడు. త్వరలో దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్తో కలిపిస్తానని చెప్పాడు. ఎప్పుడు, ఎక్కడ కలవాలో చెబుతానన్నాడు. అంతలోనే అరెస్టయ్యాం. మేం అతన్ని ఇప్పటి వరకూ చూడలేదు. ఎక్కడుంటాడో మాకు తెలీదు’ అని వారు చెప్పినట్లు తెలిసింది.
యువతే లక్ష్యంగా...
సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించి, వారిని పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్లకు పంపించి మిలిటెంట్ శిక్షణ ఇప్పించేందుకు అఫ్ఘానిస్థాన్కు చెందిన అల్ హకీం షుకూర్ కుట్ర పన్నాడు. మన దేశంలో పలు రాష్ట్రాల యువకులకు గేలం వేశాడు. పలు రాష్ట్రాల్లోని ఓ వర్గం యువతతో బెన్ ఎక్స్ డాట్ కామ్ పేరుతో సోషల్ గ్రూపు ఏర్పాటు చేయించి జీహాదీ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు. దేశ వ్యతిరేక చర్యలపై నిఘా పెట్టిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు విజయవాడలోని వించిపేట, భవానీపురం ప్రాంతాల్లో ఉంటున్న ముగ్గురు యువకుల్ని గత నెలాఖరులో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ఆటోనగర్లో వర్కర్గా పనిచేసే మహమ్మద్ డానిష్ ఏ2), బైకు నడిపించే మహమ్మద్ రహంతుల్లా షరీఫ్(ఏ1), హోటల్లో క్యాషియర్గా పనిచేసే మీర్జా సోహైల్ బేగ్(ఏ3)ను అరెస్టు చేసి విచారించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. ఏ డు రాష్ట్రాల్లో 11 మంది ఉగ్రచర్యలకు పాల్పడుతున్న ట్లు తెలిసింది. హైదరాబాద్లో ఇళ్లల్లో వంట చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ఉన్న సైదా బేగం(ఏ5), బళ్లారిలో సొంత లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్న అబ్దుల్ సలామ్(ఏ11), పట్నాలో నీట్కు సిద్ధమవుతున్నషాద్మాన్ దిల్ ఖ్షను అరెస్టు చేశారు. విజయవాడ కోర్టు అనుమతితో ఏపీ సీఐ సెల్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. వీరిచ్చిన సమాచారంతో ఒక మైనర్ సహా మరి కొందరిని అరెస్టు చేశారు. కస్టడీలో కీలక సమాచారాన్ని వెలికి తీశారు. షాద్మాన్ దిల్ఖ్ష(ఏ4), లక్మీ అహ్మద్(ఏ7), జిషన్ అబ్దుల్ మజీద్(ఏ9), మీర్ ఆసిఫ్ అలీ(ఏ10), షారూక్ ఖాన్(ఏ12), ఫయాజ్ ఉర్ రెహ్మాన్(ఏ13)లను ఈ నెల 9 నుంచి సోమవారం వరకూ విచారించారు. కస్టడీ ముగియడంతో సోమవారం ారిని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. అధికారులు.. మరో 4 రాష్ట్రాల్లో ఈ ఉగ్ర లింకులు ఉన్నట్లు కనుగొన్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న 42 మంది వివరాలు సేకరించారు. అందులో పలువురికి 25 నుంచి 40 వరకూ వివిధ పేర్లతో సోషల్ మీడియాలో ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు.
రంగంలోకి ఎన్ఐఏ
ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ పోలీసులకు సహకారం అందిస్తూ వచ్చిన ఎన్ఐఏ.. కేసును పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.