Andhra Pradesh Govt: 11 జిల్లాలకు కొత్త జేసీలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:43 AM
రాష్ట్రంలోని 11 జిల్లాలకు ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. ఈ జాబితాలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ఉన్నాయి.
పలువురు ఐఏఎస్ల బదిలీలు
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 11 జిల్లాలకు ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. ఈ జాబితాలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్గా ఉన్న పి.శ్రీ నివాసులును మార్కాపురం జిల్లా జేసీగా బదిలీ చేశారు. చిత్తూరు జిల్లా జేసీగా విధులు నిర్వహిస్తున్న గొబ్బిల్ల విధ్యాధరిని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా నియమించారు. అలాగే అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ రాజీంద్రన్ను చిత్తూరు జేసీగా ప్రభుత్వం బదిలీ చేసింది. సివిల్ సప్లయిస్ డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఆర్.గోవిందరావును బదిలీ చేసి తిరుపతిలోని తుడా వైస్ చైర్మన్గా నియమించడంతో పాటు తిరుపతి జేసీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం జేసీ గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా పంపారు. ఖాళీగా ఉన్న పల్నాడు జిల్లా జేసీగా వి.సంజన సింహాను ప్రభుత్వం నియమించింది. మరోవైపు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ బచ్చు స్మరణ్ రాజ్కు కొత్త జిల్లా పోలవరం జాయింట్ కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు.