నెల్లూరు ఇనామ్ భూములపై ఎలాంటి చర్యలొద్దు
ABN , Publish Date - May 19 , 2026 | 04:54 AM
నెల్లూరు ఇనామ్ భూముల వ్యవహారంపై ఎలాంటి తదుపరి చర్యలూ తీసుకోవద్దని రెవెన్యూ అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.
హైకోర్టు ఆదేశాలు పరిగణనలోకి తీసుకోండి.. కలెక్టర్ ఆదేశాలు
సమగ్ర నివేదిక కోరిన సర్కారు.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు ఇనామ్ భూముల వ్యవహారంపై ఎలాంటి తదుపరి చర్యలూ తీసుకోవద్దని రెవెన్యూ అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని, అధికారులు ఎలాంటి ముందడుగూ వేయరాదని రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో)కి సూచించారు. ఇనామ్ భూముల విషయంలో ఏప్రిల్లో తహశీల్దార్ కొన్ని ఉత్తర్వులివ్వగా, కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ భూముల విషయంలో ఇచ్చిన ఆదేశాలన్నీ నిలిపివేయాలని హైకోర్టు ఈ నెల 14న ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ మండలంలోని బిట్-1లోని 371 ఎకరాల భూమి విషయంలో రెవెన్యూఅధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కలెక్టర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. రూ.2వేల కోట్ల విలువైన ఇనామ్ భూముల దోపిడీకి స్కెచ్ వేశారని సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.