అప్పుల భారం జగన్ పుణ్యమే!: నీలాయపాలెం
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:47 AM
వైసీపీ హయాంలోనే రాష్ట్రంపై అప్పుల భారం ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ పేర్కొన్నారు.
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలోనే రాష్ట్రంపై అప్పుల భారం ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ను 2019-23 మధ్య భారీగా తగ్గించారని, ఎన్జీటీ అనుమతి లేకుండా పనులు చేయడం వల్ల ప్రభుత్వం భారీగా జరిమానాలు చెల్లించాల్సి వచ్చిందని కాగ్ స్పష్టంచేసిందన్నారు. కాగ్ నివేదికను వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పులు రూ.81 వేల కోట్లు కాగా, 2024 ఏప్రిల్, మే నెలల్లో తీసుకున్న రుణాలను కూడా కలిపి కాగ్ పేర్కొందన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైసీపీ పాలన ఉందని, ఆ 2 నెలల్లోనే వైసీపీ 33.5 శాతం అప్పు చేసిందని, మిగిలిన 10 నెలల కాలానికి కూటమి ప్రభుత్వం 66.5 శాతం అంటే రూ.53వేల కోట్లు అప్పు చేసిందని తెలిపారు.