పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:22 PM
స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
ఆదోని అగ్రికర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీకి చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన కమిటీ బృందం కళాశాలను సందర్శించి విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, బోధన విధానాలు, మౌలిక వసతులు, ఉపాధి కల్పన వంటి పలు అంశాలను పరిశీలించింది. సోమవారం ఎనబీఏ బృందం ఫలితాలను ప్రకటించింది. అందులో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎలక్ర్టానిక్ అండ్ కమ్యూనికేషన కోర్స్కు 2026 జనవరి నుంచి 2028 డిసెంబరు వరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన మంజూరు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.సి చిన్నపురెడ్డి మాట్లాడుతూ ఢిల్లీకి చెందిన ఎనబీఏ బృందం తమ కళాశాలను గుర్తించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం తమ అధ్యాపకులపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.