చర్చి పాస్టర్ ఇంట్లో 2.27 కోట్లు
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:24 AM
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని పాస్టర్ గంటా జాన్ బాబూరావు నివాసంలో గురువారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా సోదాలు జరిపారు.
సొమ్ముపై పొంతన లేని జవాబులు
ఆస్తుల మూలాలపై ఆరా తీస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు
నరసాపురం రూరల్, ఏప్రిల్ 16(ఆంద్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని పాస్టర్ గంటా జాన్ బాబూరావు నివాసంలో గురువారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా సోదాలు జరిపారు. ఆయన నివాసం నుంచి రూ.2.27కోట్ల నగదు సీజ్ చేశారు. బాబూరావు కుటుంబం పెద్దఎత్తున ఆస్తులు కొనుగోలు చేయడం, లక్షలాది రూపాయలు ఎడాపెడా ఖర్చు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై వారు నిఘా పెట్టారు. గురువారం పాస్టర్ బంధువు ఒకరు సూట్ కేస్ తీసుకుని బాబూరావు ఇంటికి వచ్చారు. అదే సమయంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ముందుగా సూట్కేస్లోని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో సోదాలు చేయగా రూ.500 నోట్ల కట్టలు వెలుగుచూశాయి. ఈ నగదుపై పోలీసులు పాస్టర్ కుటుంబ సభ్యులను విచారించగా.. పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో నగదును సీజ్ చేసి సర్కిల్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. సీజ్ చేసిన సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.