షోలింగర్ యోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లోకేశ్ పూజలు
ABN , Publish Date - May 30 , 2026 | 05:13 AM
తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్లో ప్రసిద్ధిచెందిన అమృతవల్లి అమ్మవారు సమేత నరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంతి నారా లోకేశ్ దర్శించుకున్నారు.
తిరుత్తణి, మే 29 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్లో ప్రసిద్ధిచెందిన అమృతవల్లి అమ్మవారు సమేత నరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంతి నారా లోకేశ్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం షోలింగర్కు చేరుకున్న మంత్రి లోకేశ్కు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోప్కార్ ద్వారా కొండ ఆలయానికి చేరుకుని నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు లోకేశ్కు వేదాశీర్వచనం చేసి శాలువతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం యోగ నరసింహస్వామి ఆలయం సమీపంలోని మరో కొండపై కొలువుదీరిన శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. కాలినడకన 420 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పులిపర్తి నాని, గురజాల జగన్మోహన్, డా.కె.మురళీమోహన్ తదితరులు ఉన్నారు.