ప్రజలిచ్చిన నమ్మకమే నా ధైర్యం
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:32 AM
‘2019 ఎన్నికల తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నా. ఆ ఎన్నికల్లో నన్ను స్థానిక ప్రజలు అర్థం చేసుకునే లోపు ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితంగా 5,300 ఓట్లతో ఓడిపోయాను.
మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
మలివిడత పట్టాల పంపిణీలో మంత్రి లోకేశ్
మంగళగిరి సిటీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): ‘2019 ఎన్నికల తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నా. ఆ ఎన్నికల్లో నన్ను స్థానిక ప్రజలు అర్థం చేసుకునే లోపు ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితంగా 5,300 ఓట్లతో ఓడిపోయాను. కొడుకును కూడా గెలిపించుకోలేకపోయావని మా నాన్ననూ అవమానించారు’ అని మంత్రి లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ పేరిట మంగళగిరి నియోజకవర్గంలోని పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. మంగళగిరి బైపాస్ రోడ్డులోని సీకే కన్వెన్షన్లో రెండు రోజులు ఈ కార్యక్రమం జరగనుంది. ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘గతంలో ఓటమి పాలైన 5,300 ఓట్లకు పక్కన ఒక్క సున్నా పెట్టి గెలిపించమని కోరాను. ఎవ్వరూ ఊహించని విధంగా మంగళగిరి ప్రజలు రాష్ట్రంలోనే టాప్-3 మెజార్టీతో నన్ను గెలిపించారు. 2024 ఎన్నికల తర్వాత వారే నా నమ్మకమయ్యారు. వారిచ్చిన నమ్మకమే ఈ రోజు ధైర్యంగా నన్ను ముందుకు నడిపిస్తోంది. మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది ధ్యేయం. గత ఐదేళ్లలో స్థానికంగా ఎవరిని కలిసినా తమ భూమికి శాశ్వత హక్కు కావాలని అడుగుతూ వచ్చారు. ఒకేసారి అందరి భూములను రెగ్యులరైజ్ చేయలేనని, అధికారంలోకి వచ్చాక విడతల వారీగా భూములకు శాశ్వత హక్కు కల్పిస్తానని హామీ ఇచ్చా. ఆ మేరకు పేదలకు బట్టలు పెట్టి మరీ ఇళ్ల పట్టాలను అందజేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధితోపాటు మంగళగిరి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు నా కృతజ్ఞతలు’ అని తెలిపారు.