నిద్ర లేచేసరికి ఇల్లు గుల్ల!
ABN , Publish Date - May 18 , 2026 | 04:46 AM
వేసవి నేపథ్యంలో అందరూ ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. దొంగలు ఇంటి వెనుక తలుపును పగులగొట్టి, 30 తులాల బంగారం, కేజీ వెండి, రూ.లక్ష నగదు చోరీ చేశారు.
30 తులాల బంగారం, కేజీ వెండి, లక్ష నగదు చోరీ
ఆళ్లగడ్డ, మే 17(ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో అందరూ ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. దొంగలు ఇంటి వెనుక తలుపును పగులగొట్టి, 30 తులాల బంగారం, కేజీ వెండి, రూ.లక్ష నగదు చోరీ చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ భారీ చోరీ. గ్రామంలో నివసిస్తున్న పాల వ్యాపారి పీర్ల హుస్సేన్కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె షాజహాన్బేగం పిల్లలకు సెలవులు కావడంతో పుట్టింటికి వచ్చారు. ఆమెకు చెందిన 20 తులాల బంగారం, ఎల్ఐసీలో కట్టెందుకు దాచిఉంచిన రూ.లక్ష నగదును దొంగలు చోరీ చేశారు. చిన్నకుమార్తె ముంతాజ్ బేగంకు ఇటీవలే పెళ్లి జరిగింది. అక్క పుట్టింటికి వచ్చినట్టు తెలుసుకొని ముంతాజ్ బేగం కూడా పుట్టింటికి వచ్చారు. ఆమెకు సంబంధించిన 10 తులాల బంగారం కూడా దొంగలు దోచేశారు. కుటుంబ సభ్యులందరికి చెందిన కేజీ వెండిని కూడా అపహరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.