‘నాగవైష్ణవి’ హత్య కేసులో సుప్రీంకోర్టుకు..!
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:23 AM
చిన్నారి నాగవైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పంది వెంకటరావును హైకోర్టు ఇటీవల నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది.
బెజవాడ పోలీసుల యోచన
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
చిన్నారి నాగవైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పంది వెంకటరావును హైకోర్టు ఇటీవల నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. దీనిపై హోంశాఖలో చర్చ జరిగినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ అధికారులు ఉన్నట్లు సమాచారం. 2010లో విజయవాడ అయోధ్యనగర్కు చెందిన పలగాని నాగవైష్ణవి (10) తన సోదరుడితో కలిసి బడికి వెళ్తుండగా కొంతమంది కిడ్నాప్ చేశారు. ఆ బాలికను చంపేసి, గుంటూరులోని కార్ఖానా బాయిలర్లో వేసి కాల్చేశారు. ఈ ఘటనను తట్టుకోలేక ఆమె తండ్రి ప్రభాకర్గౌడ్ గుండెపోటుతో మరణించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రభాకర్ బావమరిది(మొదటి భార్య సోదరుడు) పంది వెంకటరావుతో పాటు ఎం.శ్రీనివాసరావు, వై.సాగర్ అలియాస్ జగదీష్లను నిందితులుగా నిర్ధారించారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు 2018లో ఈ ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. దీనిపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. వెంకటరావును నిర్దోషిగా ప్రకటించింది.