కూటమిలో చిచ్చుకు కుట్ర
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:06 AM
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ఓ ఎమ్మెల్యే సన్నిహితుల కాల్ డేటా రికార్డులు సేకరిస్తున్నానంటూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కూటమి...
నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కథనాలు: ఎంపీ కేశినేని చిన్ని
‘సాక్షి’పై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు
న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ఓ ఎమ్మెల్యే సన్నిహితుల కాల్ డేటా రికార్డులు సేకరిస్తున్నానంటూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేలా ‘సాక్షి’ దినపత్రిక కథనాలు ప్రచురిస్తోందని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్జీఐ), విజయవాడ పోలీసు కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ పత్రిక యాజమాన్యం, సంపాదకుడు, రిపోర్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘అందులో రాసినట్లుగా నేను ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల కాల్ డేటా సేకరించాలనుకుంటే తొలుత ఆయా సెల్ కంపెనీలకు వారి నంబర్లు ఇచ్చి, కాల్ డేటా కోరాలి. అలా కోరినట్లు ఆ పత్రిక వద్ద ఆధారాలున్నాయా? ఉంటే వెల్లడించాలి. లేదంటే ఆ పత్రిక వెంటనే ఆ కథనాన్ని ఉపసంహరించుకుని, ప్రజలముందు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో వారిపై న్యాయపోరాటానికి సైతం వెనుకాడేది లేదు’ అని చిన్ని స్పష్టం చేశారు.