అదే మాట.. మిథున్ నోట!
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:44 AM
‘జగన్ ఏం చెబితే అది చేస్తాం!’... ఇది జగన్కు అత్యంత సన్నిహితుడు, ఎంపీ మిథున్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పిన విషయం! ‘వీకెండ్ కామెంట్’లో రాసిందీ అదే! ‘జగన్ అమరావతి అంటే అమరావతి అంటారు.
జగన్కు ‘ఆత్మాహుతి దళం’లా ఉంటాం
ఆయన ఏం చెబితే అది చేస్తామని ఉద్ఘాటన
‘వీకెండ్ కామెంట్’లో చెప్పిందీ అదే కదా!
అమరావతి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ‘జగన్ ఏం చెబితే అది చేస్తాం!’... ఇది జగన్కు అత్యంత సన్నిహితుడు, ఎంపీ మిథున్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పిన విషయం! ‘వీకెండ్ కామెంట్’లో రాసిందీ అదే! ‘జగన్ అమరావతి అంటే అమరావతి అంటారు. మూడు రాజధానులంటే ఔనవును అంటారు. మావిగన్ అనగానే దానికి జై కొడతారు’ అనే ‘వీకెండ్ కామెంట్’లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ రాశారు. ఈ విషయాన్ని కొన్ని ఉపమానాలతో మరింత సూటిగా చెప్పారు. జగన్ నంది అంటే నంది అంటారు. పంది అంటే పంది అంటారు. చివరికి భార్య కాదు చెల్లి... అన్నా తలలూపే వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైందని ‘వీకెండ్ కామెంట్’లో పేర్కొన్నారు. జగన్ చెప్పిందల్లా చేయడమే తప్ప మరోమాట మాట్లాడలేని అసహాయత, అశక్తత గురించే అందులో విశ్లేషించారు. ఇప్పుడు... తాజాగా ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంపీ మిథున్ రెడ్డి కూడా అదే చెప్పారు. ‘‘జగన్ ఏ పని చెప్పినా చేస్తాం. చెయ్యడం మా బాధ్యత. జగన్కు చాలామంది అభిమానులున్నారు. అందరూ ఆత్మాహుతిదళంలా పని చేస్తారు’’ అని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు... జగన్ చెప్పింది చెప్పినట్లు చెయ్యలేని వాళ్లు వెళ్లిపోతుంటారని కూడా చెప్పారు. అంటే, జగన్ చెప్పింది చెప్పినట్లు చేసేవారు మాత్రమే వైసీపీలో ఉంటారు. చేయలేనివాళ్లు తమదారి తాము చూసుకోక తప్పదన్న మాట!