వినుకొండ పరిసరాల్లో భూ ప్రకంపనలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:11 AM
పల్నాడు జిల్లా వినుకొండలో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
వినుకొండటౌన్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా వినుకొండలో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు భూగర్భ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో వినుకొండ పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉండటం వల్ల ప్రకంపనల తీవ్రత స్పష్టంగా తెలిసినట్టు సమాచారం. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు ఇప్పటివరకు నివేదికలు అందలేదు.