నేతన్నలను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సవిత
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:09 AM
చేనేతలను కూటమి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత చెప్పారు.
పెనుకొండ టౌన్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): చేనేతలను కూటమి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత చెప్పారు. ఆ దిశగా ఉచిత విద్యుత్ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో బుధవారం ఆమె ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల మనసులో రియల్ హీరోగా నిలిచారని అన్నారు. రాష్ట్ర పతనాన్ని కోరుకుంటున్న జగన్ను ప్రజలు విలన్లాగా చూస్తున్నారని చెప్పారు. కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు.