జగన్ మాటలు నమ్మొద్దు
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:50 AM
రాజధానిపై రోజుకో రకంగా మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ మాటలు నమ్మొద్దని రాష్ట్ర శిశు సంక్షేమ, గిరిజన శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రజలకు..
రాజధానిపై ఆయనది రోజుకో మాట: మంత్రి సంధ్యారాణి
వినుకొండ, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాజధానిపై రోజుకో రకంగా మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ మాటలు నమ్మొద్దని రాష్ట్ర శిశు సంక్షేమ, గిరిజన శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రజలకు సూచించారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రాజధాని అని, నేడు మావిగన్ అని, అనంతరం విజయవాడ అని చెప్పడం విచిత్రంగా ఉందని విమర్శించారు. ప్రతిపక్ష హోదా లేనివారు రాజధాని విషయంలో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదు రోజులకొకసారి బెంగళూరు వెళ్లి వచ్చి రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ వసతి గృహాలకు కనీసం ప్లేట్లు పంచిన దాఖలాలు లేవని విమర్శించారు. నాడు నిధులు మళ్లించి, నేడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి తేడా గ్రహించాలని ఆమె ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.