ఇందాపూర్పై అనవసర రాద్ధాంతం
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:19 AM
ఇందాపూర్ డెయిరీపై వైసీపీది అనవసర రాద్ధాంతమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కల్తీ నెయ్యి ఉదంతాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ డ్రామా: పార్థసారథి
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఇందాపూర్ డెయిరీపై వైసీపీది అనవసర రాద్ధాంతమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హెరిటేజ్ సంస్థ నాణ్యత విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ‘గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో పాలు ప్యాకింగ్ చేసే ‘ఫిలిం’ ఫ్యాక్టరీ ఉండేది. అయినా హెరిటేజ్ సంస్థ నాకు ఆర్డర్లు ఇచ్చేది. ఒక రోజు హెరిటేజ్ అధికారి తనిఖీకి వచ్చిన సమయంలో అక్కడ కొన్ని దోమలు, పురుగులు ఉండటం చూసి వెంటనే ఆర్డర్లు రద్దు చేశారు. హెరిటేజ్ సంస్థ నాణ్యతకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని అన్నారు. ఎయిర్బస్ సంస్థ అయినా అన్ని విడిభాగాలనూ తమ కంపెనీలోనే తయారు చేయదని, వివిధ కంపెనీల నుంచి కాంపోనెంట్స్ తీసుకుని అసెంబల్ చేస్తాయని వ్యాఖ్యానించారు. అలాగే, హెరిటేజ్ సంస్థ కూడా ఇందాపూర్ నుంచి చీజ్ కొనుగోలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తిరుమల కల్తీ నెయ్యి ఉదంతాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరదీశారని మండిపడ్డారు. నెయ్యి కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినా వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు