గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే!
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:51 AM
కీలకమైన నీటి పారుదల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిందేనని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాలకు ప్రాధాన్యం
అనకాపల్లికి గోదావరి జలాలు తీసుకెళ్లేలా చర్యలు: మంత్రి నిమ్మల
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కీలకమైన నీటి పారుదల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిందేనని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ టన్నెల్ పనులు మందగించడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని మంత్రి కర్తవ్య బోధ చేశారు. సీజన్ ముగిసేలోగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను తరలించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైవేల క్రాసింగ్ల దగ్గర వంతెనల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతివారం వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించాలని కాంట్రాక్టు సంస్థ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే నిర్వాసితుల ఖాతాల్లో సహాయ, పునరావాస పరిహారం డబ్బులు జమయ్యేలా చూడాలని ఆదేశించారు. జూన్ నాటికి నల్లమల సాగర్ను నింపేలా వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.