దమ్ముంటే జగన్ను నిలదీయండి
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:32 AM
వెలిగొండపై ఇప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదని, ప్రాజెక్టు విషయమై దమ్ముంటే మీ నాయకుడు జగన్ను నిలదీసి అడగాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు...
వైసీపీ నేతలకు మంత్రి నిమ్మల హితవు
మార్కాపురం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): వెలిగొండపై ఇప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదని, ప్రాజెక్టు విషయమై దమ్ముంటే మీ నాయకుడు జగన్ను నిలదీసి అడగాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హితవు పలికారు. శుక్రవారం మార్కాపురం జిల్లా దోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద వెలిగొండ టన్నెల్ పనులను, ఫీడర్ కాలువను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో అక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయకుండానే జాతికి అంకితం చేసిన జగన్ చరిత్రలో సరిదిద్దుకోలేని తప్పుచేశాడు. ఆ విషయం వదిలేసి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, వెంటనే పూర్తిచేయాలని వైసీపీ నాయకులు అడగటం విడ్డూరంగా ఉంది. ప్రాజెక్టును పూర్తిచేయాలని మీరు అడుగుతున్నారంటే మీ జగన్ చేసింది మోసమేనని అంగీకరిస్తున్నట్టేనా?’ అని ప్రశ్నించారు. పనులు పెండింగ్లో ఉండగానే ప్రాజెక్టును పూర్తిచేశామని ప్రజలను మోసగించి జాతికి అంకితం చేసిన జగన్ను వదిలేసి ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత వైసీపీ నాయకులకు లేదని మంత్రి స్పష్టం చేశారు.