ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటిపారుదల వ్యవస్థలను సన్నద్ధం చేయండి
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:47 AM
ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటి విడుదలకు వీలుగా కాలువలు, ప్రాజెక్టులను సన్నద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
ఇరిగేషన్ సమీక్షలో మంత్రి నిమ్మల
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటి విడుదలకు వీలుగా కాలువలు, ప్రాజెక్టులను సన్నద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈ ఏడాది మే 15 నాటికి ప్రాజెక్టులు, కాలువలకు సంబంధించి యాజమాన్య నిర్వహణ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఖరీఫ్కు అందజేయడంపై ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతు పనులన్నీ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడికతీసి, ఆ మట్టిని క్యూబిక్ మీటరు రూపాయికే రైతులకు అందించాలని ఆదేశించారు. సమావేశంలో జల వనరుల శాఖ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.