లీడర్తో ఆత్మీయ భేటీ!
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:50 AM
మంత్రి లోకేశ్ కొత్త సంప్రదాయానికి తెరదీశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో పార్లమెంటు నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలతో సమావేశం
కొత్త సంప్రదాయానికి లోకేశ్ శ్రీకారం
నేడు బందరు, రేపు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో భేటీ
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్ కొత్త సంప్రదాయానికి తెరదీశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో పార్లమెంటు నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రోజుకో పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలతోపాటు ఆ పార్లమెంటు పరిధిలో ఎవరైనా ఎమ్మెల్సీ ఉంటే వారి కుటుంబంతోనూ లోకేశ్ సమావేశం కానున్నారు. ప్రతి రోజూ రాత్రి ఏడు గంటల నుంచి ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల ద్వారా.. నేతల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి కుటుంబ సభ్యుల మంచిచెడులను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీలో పవన్తో లోకేశ్ భేటీ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. బుధవారం అసెంబ్లీకి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ చాంబర్కు వెళ్లిన లోకేశ్ ఆయనతో అరగంటపాటు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, గవర్నర్ ప్రసంగం తదితర అంశాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. చివరిలో శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కూడా వీరితోపాటు సమావేశంలో పాల్గొన్నారు.