గొడ్డలిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్: కొల్లు
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:43 AM
రాష్ట్రంలో గొడ్డలిపోటుకు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గొడ్డలిపోటుకు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబాయ్ని గొడ్డలితో నరికి చంపిన నిందితులను కాపాడుతూ సొంత చెల్లి ఉసురు పోసుకుంటున్న వ్యక్తి జగన్ అన్నారు. సొంత తల్లి, చెల్లిని ఆస్తుల కోసం ఇల్లు వదిలిపెట్టేలా చేసిన, తోడబుట్టిన చెల్లికి తండ్రి ఆస్తిలో సగ భాగం ఇవ్వాలనే మహిళా ఆస్తి హక్కు చట్టానికి వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్దేనన్నారు. అధికారంలోకి వస్తే మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పిన హామీని నెరవేర్చకపోగా నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన కర్కోటకుడు జగన్ అన్నారు. మాట ఇచ్చి.. మడమ తిప్పడం గొడ్డలి పార్టీ విధానం అయితే, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.