నాడు విధ్వంసం చేసి నేడు ప్రగల్భాలా?
ABN , Publish Date - May 11 , 2026 | 04:22 AM
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, జగన్ తన క్రిమినల్ మనస్తత్వంతో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, జగన్ తన క్రిమినల్ మనస్తత్వంతో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి నేడు వైసీపీ నాయకులు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ‘నిరుద్యోగ యువత కోసం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతోపాటు గ్రూప్ 1, 2, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రైవేటు రంగంలో ఇప్పటికే 6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే 22 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే’ అని అన్నారు. వైసీపీ హయాంలో కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లు తప్ప ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదన్నారు. పేదల భూములను 22ఏ కింద పెట్టి వైసీపీ నేతలు కారుచౌకగా కొట్టేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని అడ్డుకుందని కొల్లు తెలిపారు.