అనుచిత వ్యాఖ్యలను సభ్యసమాజం సహించదు: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:09 AM
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ్యసమాజం ఏమాత్రం సహించదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
పంగులూరు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ్యసమాజం ఏమాత్రం సహించదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా పంగులూరు మండలంలోని ముప్పవరం క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘పవిత్ర తిరుమల క్షేత్రాన్ని, స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. రసాయినాలతో కూడిన కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదాలలో వాడారు. ఆ విషయాన్ని అధికార యంత్రాంగం విచారణలో నిగ్గుతేల్చినా వైసీపీ నేతలు అడ్డగోలుగా బుకాయించడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆపార్టీ నేతలు సమర్థిస్తారా? వైసీపీ నేతలు ఇదే పంథాలో వ్యవహరిస్తే ఆపార్టీకి ప్రజాక్షేత్రంలో మనుగడ లేకుండా పోతుంది’ అని మంత్రి హెచ్చరించారు.