వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పెండింగ్ వద్దు
ABN , Publish Date - May 19 , 2026 | 06:23 AM
‘వ్యవసాయ కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలి. పెండింగ్లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లను తక్షణం పరిష్కరించాలి’ అని విద్యుత్తు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
డిస్కంల సీఎండీలకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ‘వ్యవసాయ కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలి. పెండింగ్లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లను తక్షణం పరిష్కరించాలి’ అని విద్యుత్తు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. విద్యుత్తు పంపిణీ సంస్థల(డిస్కంల) సీఎండీలతో సోమవారం మంత్రి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ‘లోవోల్టేజీ సమస్యలు లేకుండా చూసుకోవాలి. వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్తు అంతరాయాలు ఉండటానికి వీల్లేదు. సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్తు కోత విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం ముందుగా తెలియజేయడంతోపాటు సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండి అలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎ్సఎస్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి’ అని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.