హజ్యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి ఫరూక్
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:52 AM
హజ్యాత్రకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదేశించారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఎస్ఎం....
హజ్యాత్రకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదేశించారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో హజ్ క్యాంప్-2026 ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి హజ్యాత్రకు 2000 మంది బయలుదేరనున్నారని, వారిలో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఏప్రిల్ 18, 19 తేదీల్లో 352 మంది బయలుదేరనున్నారని మంత్రి చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్ నుంచి హజ్కు వెళ్లే యాత్రికులందరికీ కూటమి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు చేరుకునే హజ్యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. విమానాశ్రయంలో హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక కౌంటర్లు, విడిగా అరైవల్, డిపార్చర్ లాంజ్లను, నమాజు వసతిని కల్పించాలని, చెక్ ఇన్ ప్రక్రియ కోసం అదనపు సిబ్బందిని నియమించాలని, హజ్ కమిటీతో సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. క్యాంపులు, లాంజ్ల వద్ద సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కరెన్సీ మార్పిడి, హజ్ చెల్లింపుల కోసం క్యాంపు, విమానాశ్రయం వద్ద తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హజ్ యాత్రికులు విజయవాడ క్యాంపునకు చేరుకునేందుకు, అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.