తప్పుడు మనుషులు.. తప్పుడు రాతలు
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:53 AM
వ్యవసాయ రంగంపై తప్పుడు కథనాలు రాసిన జగన్ పత్రికపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ‘తప్పుడు మనుషులు, తప్పుడు రాతలు, కావాలనే వాస్తవాలను వక్రీకరించారు’ అని మండిపడ్డారు.
జగన్ పత్రికపై మంత్రి అచ్చెన్న ఫైర్
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంపై తప్పుడు కథనాలు రాసిన జగన్ పత్రికపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ‘తప్పుడు మనుషులు, తప్పుడు రాతలు, కావాలనే వాస్తవాలను వక్రీకరించారు’ అని మండిపడ్డారు. ఈమేరకు ఆదివారం మంత్రి ఒక ప్రకటన జారీ చేశారు. కూరగాయలు రోడ్లపై పారేస్తున్నారని, రైతులు నష్టాల్లో ఉన్నారంటూ రాసిన కథనం వైసీపీ స్ర్కిప్టుగా అభివర్ణించారు. ఒకటి రెండు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని మొత్తం రాష్ట్రానికి వర్తింపజేసి, సంక్షోభంలా చిత్రీకరించడం రాజకీయ దురుద్ధేశంతో చేసిన కుట్రపూరిత ప్రచారమని మండిపడ్డారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రైతులకు మద్దతు ధర కల్పించకపోగా, ఇన్పుట్ సబ్సిడీల్లో తీవ్ర జాప్యం చేయడం వల్ల ఆనాడు రైతులు పంట ఉత్పత్తులను రోడ్లపై పారేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసి, నిల్వ సదుపాయాలు, ధరల స్థిరీకరణ చర్యలు సత్ఫలితాలు ఇస్తుంటే.. వాస్తవాలను ఒప్పుకునే ధైర్యం లేక, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.