Minister Atchannaidu: మిర్చి ధరల స్థిరీకరణకు ముందస్తు చర్యలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:25 AM
రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి క్రయవిక్రయాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ధరల స్థిరీకరణకు ముందస్తు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
కోల్డ్స్టోరేజీల్లోని మిర్చికి రుణాలు: మంత్రి అచ్చెన్న
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి క్రయవిక్రయాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ధరల స్థిరీకరణకు ముందస్తు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. బుధవారం గుంటూరులోని మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్లో మిర్చి ధరలపై ఆయన సమీక్ష నిర్వహించారు. మిర్చి వ్యాపారులు, ఎగుమతిదారులు, రైతు ప్రతినిధులు, కమిషన్ ఏజెంట్లతో చర్చించారు. అచ్చెన్న మాట్లాడుతూ... ‘నిరుటితో పోల్చితే మిర్చి సాగు విస్తీర్ణం తగ్గింది. ఉత్పాదకత 44శాతం తగ్గింది. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు నిలకడగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలి. కోల్డ్ స్టోరేజీల్లో ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. గుంటూరు యార్డుకు ఇతర రాష్ట్రాల నుంచి మిర్చి వస్తున్నందున స్థానిక రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. మిర్చి రైతులకు రశీదులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. యార్డులో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించాం’ అని తెలిపారు. మార్కెట్లో ఉన్న పోటీ ధరలు చెల్లించాలని లారీల యజమానులు, వర్షం కురిస్తే యార్డులో మిర్చి టిక్కీలు తడిసిపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతు ప్రతినిధులు కోరారు.