వివేకా హత్యలో నిజం దాచేందుకు తపిస్తున్న వైసీపీ
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:42 AM
‘వైఎస్ వివేకా హత్యలో నిజం దాచేందుకు వైసీపీ తపిస్తోంది. తప్పులు చేసి దొరికిపోయిన తర్వాత కూడా అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారు’ అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది: మంత్రి అనగాని
అమరావతి, రేపల్లె, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్ వివేకా హత్యలో నిజం దాచేందుకు వైసీపీ తపిస్తోంది. తప్పులు చేసి దొరికిపోయిన తర్వాత కూడా అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారు’ అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘చెల్లి బాధపై స్పందించని జగన్, ప్రధాన నిందితుడితో విలేకరుల సమావేశం పెట్టించడం దుర్మార్గం. సొంత బాబాయిని చంపిన హం తకుల్ని కాపాడేందుకు జగన్ పరితపిస్తున్నాడు. సునీతనే నిందితురాలిగా చేసేందుకు జగన్ ప్రయత్నించడం దుర్మార్గం.’ అంటూ మంత్రి మండిపడ్డారు. వివేకాని సౌమ్యుడని జగన్ చేసిన కామెంట్లు మొదలుకొని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ చేసిన వ్యాఖ్యానాల వరకూ మంత్రి వీడియోలను ప్రదర్శించారు. కాగా.. రాష్ట్రంలోనూ, రేపల్లెలోనూ వైసీపీ నాయకులు రౌడీయిజం చేస్తానంటే ఉపేక్షించేదిలేదని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.