విష ప్రచారాన్ని మానుకోండి!
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:54 AM
వైసీపీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు ఆదివారం నెల్లూరులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి..
నెల్లూరు ఆత్మగౌరవ ర్యాలీలో వైసీపీపై మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల ఆగ్రహం
నెల్లూరు(విద్య), ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు ఆదివారం నెల్లూరులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు తరలి వచ్చారు. వీఆర్ హైస్కూల్ క్రీడా మైదానం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వెళ్లి, వినతిపత్రం అందజేశారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్లో మానవహారం చేపట్టారు. తమ ఆత్మగౌరవాన్ని అవమానించొద్దని, విష ప్రచారాన్ని మానుకోవాలని టీచర్లు ఈ సందర్భంగా వైసీపీకి హితవు పలికారు. వైసీపీ నేతలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైన ఆరోపణలు చేస్తుండడంతో తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించుకుంటే తమను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు పునరావృతమైతే తగిన బుద్ధి చెపుతామని, అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు.