రాజాంలో భారీ చోరీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:59 AM
విజయనగరం జిల్లా రాజాంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. జీఎంఆర్ఐటీ ప్రాంగణంలోని రెండు ఫ్లాట్లలో బంగారం, వెండి దుండగులు ఎత్తుకెళ్లారు.
జీఎంఆర్ఐటీ ప్రాంగణంలోని రెండు ప్లాట్లలో..1541 గ్రాముల బంగారం, కిలో వెండి అపహరణ
రాజాం రూరల్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా రాజాంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. జీఎంఆర్ఐటీ ప్రాంగణంలోని రెండు ఫ్లాట్లలో బంగారం, వెండి దుండగులు ఎత్తుకెళ్లారు. జీఎంఆర్ఐటీ ప్రాంగణంలోని రస క్వార్టర్స్ మూడో ఫ్లోర్లో నివాసం ఉంటున్న జీఎంఆర్ కేర్ ఆస్పత్రి చిన్న పిల్లల వైద్యుడు నగేశ్ శనివారం విధులు ముగించుకుని కుటుంబంతో కలిసి విశాఖకు వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి, బీరువాలు పగలగొట్టి, ఆభరణాల బాక్స్లన్పీ చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించి పొలీసులకు ఫిర్యాదు చేశారు. నగేశ్ తన ఫ్లాట్లో కిలో వెండి, 1250 గ్రాముల బంగారం చోరీ జరిగినట్లు పేర్కొన్నారు. ఇదే ప్రాంగణంలో లయ అపార్ట్మెంట్ మూడోఫ్లోర్లో నివాసం ఉంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధవకృష్ణ రెడ్డి కూడా శనివారం తన భార్యతో కలిసి పాలకొండ వెళ్లారు. క్యాంప్సలో భారీ చోరీ జరిగిందని తెలుసుకున్న ఆయన సోమవారం తిరిగి తన ప్లాట్కు చేరుకుని చూస్తే బీరువాతాళాలు తెరిచి ఉన్నాయి. అందులో 291 గ్రాముల బంగారం పోయిందని నిర్ధారించుకుని పొలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ చోరీకి గురైన రెండు ఇళ్లను సోమవారం సాయంత్రం పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా చోరీలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. రెండు ఘటనల్లో 1541 గ్రాముల బంగారం, కిలో వెండి అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు.