శ్రీశైలంలో మహాశివరాత్రి సంరంభం
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:05 AM
అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేదమంత్రాల నడుమ ధ్వజపట ఆవిష్కరణ
నేడు భృంగి వాహన సేవ
శ్రీశైలం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆల య అధికారులు, అర్చకులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చతుర్వేదపారాయణం, వేదస్వస్థి జరిపించారు. లోకకల్యాణార్థం ఆలయంలో బ్రహ్మోత్సవ శివ సంకల్పాన్ని పఠించారు. రాత్రి 8:30 గంటలకు సకల పరివార దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఆలయ ఈఓ శ్రీనివాసరావు దంపతులు, శ్రీశైలం ఆలయ ట్రస్టుబోర్డు అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, ప్రధానార్చకులు విజయ్, ట్రస్టుబోర్డు సభ్యులు దేవకి వెంకటేశ్వర రావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు సోమవారం భృంగివాహన సేవ నిర్వహిస్తారు.