పోక్సో కేసులుగా ప్రేమ వివాహాలు!
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:14 AM
తల్లిదండ్రుల వ్యతిరేకత కారణంగా ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు పోక్సో కేసులుగా మారుతున్నాయని మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
తల్లిదండ్రుల వ్యతిరేకతే కారణం.. మద్రాస్ హైకోర్టు అసంతృప్తి
చెన్నై, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల వ్యతిరేకత కారణంగా ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు పోక్సో కేసులుగా మారుతున్నాయని మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోక్సో చట్టంపై మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్కు చెందిన మహేష్.. తన స్నేహితుడి సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లినాటికి ఆ బాలిక వయస్సు 16 ఏళ్లు. ఈ క్రమంలో ఆమె, మహేష్ భార్యాభర్తలుగా జీవిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుతో అధికారులు ఆ బాలికను నాగర్కోయిల్ మహిళా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మహే్షపై పోక్సో కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారించిన నాగర్కోయిల్ ప్రత్యేక కోర్టు.. మహే్షకు 25 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మహేష్ ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ అప్పీలుపై ఇటీవల విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. ఈ కేసులో బాలిక వయస్సు నిర్ధారించే సర్టిఫికెట్లు దాఖలు చేయలేదని, ఆమె వయస్సు నిరూపణ కానందువల్ల పోక్సో చట్టం వర్తింపజేయలేరని అభిప్రాయపడింది. మహే్షకు విధించిన శిక్ష రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రేమ వివాహాలు.. తల్లిదండ్రుల వ్యతిరేకతతో పోక్సో కేసులుగా మారుతున్నాయని వ్యాఖ్యానించింది. పోక్సో చట్టంపై అవగాహన కల్పించేలా టీవీ, ఆకాశవాణి, వార్తాపత్రికల్లో ప్రచారం చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.