అవును కేఎన్ఆర్ వాటా కొన్నాడు
ABN , Publish Date - May 31 , 2026 | 05:32 AM
‘మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ నా షోరూమ్లో వాటా కొన్నది నిజమే’.. అని విజయవాడలోని లక్కీ హుందాయ్ కార్ల షోరూమ్ యజమాని ఉస్మాన్ సందీప్ సిట్ అధికారులకు స్పష్టం చేశాడు
సిట్ ముందు గుట్టు విప్పిన కార్ల షోరూమ్ యజమాని
‘డబ్బు’ వ్యవహారంపై పొంతనలేని సమాధానాలు
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ నా షోరూమ్లో వాటా కొన్నది నిజమే’.. అని విజయవాడలోని లక్కీ హుందాయ్ కార్ల షోరూమ్ యజమాని ఉస్మాన్ సందీప్ సిట్ అధికారులకు స్పష్టం చేశాడు. తాను అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఆ సమయంలో వాటా విక్రయించేందుకు పలువురిని సంప్రదించగా కేఎన్ఆర్ కొనుగోలు చేశాడని వివరించినట్లు తెలిసింది. ‘రెండు కోట్ల రూపాయలకు అంత పెద్ద కార్ల షోరూమ్లో 51 శాతం వాటా ఇచ్చావా?’ అని సిట్ అధికారులు ప్రశ్నించగా.. అప్పట్లో తన ఆర్థిక పరిస్థితి బాగోలేనందునే ఇవ్వాల్సి వచ్చిందని బదులిచ్చినట్లు సమాచారం. ‘ఆ సొమ్ము వైట్లో ఇచ్చారా? బ్లాకులో ఇచ్చారా? నగదు ఎంత?’ అనే ప్రశ్నలకు ఉస్మాన్ సందీప్ పొంతన లేని సమాధానం ఇచ్చాడు. తమ ఆడిటర్ చెబుతాడంటూ పక్కనున్న ఆడిటర్ను ముందు పెట్టినట్లు తెలిసింది. అన్ని ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు పరిశీలించిన సిట్ అధికారులు మరోసారి పిలుస్తామంటూ పంపించారు.