ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:56 PM
ఆదోనిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుదామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పిలుపునిచ్చారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
పట్టణంలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’
ఆదోని/ఆదోనిటౌన, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆదోనిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుదామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. కోట్ల సర్కిల్లో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అనంతరం గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పని చేసినప్పుడే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పట్టణాన్ని నిర్మించగలమని తెలిపారు. ప్రజల్లో పరిశుభ్రతపై మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళి, బాబురావు, రాఘవరెడ్డి, లక్ష్మన్న, ఉపేంద్ర, విజయ్, మునిసిపల్, సచివాలయ సిబ్బంది పొదుపు గ్రూపు మహిళలు పాల్గొన్నారు.