డీసీహెచ్ఎస్ అధికారికి ఏడేళ్ల జైలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:34 AM
లంచం కేసులో కర్నూలు ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డీసీహెచ్ఎస్ అధికారికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.
రెండు లక్షలు జరిమానా కూడా.. ఏసీబీ కోర్టు తీర్పు
కడప క్రైం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): లంచం కేసులో కర్నూలు ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డీసీహెచ్ఎస్ అధికారికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ఆసుపత్రి సేవల (డీసీహెచ్ఎ్స) సమన్వయ అధికారిగా డాక్టర్ మాడభూషి శేషపద్మజ విధులు నిర్వహించారు. ఆమె కార్యాలయంలోనే జూనియర్ అసిస్టెంటుగా రాధిక పనిచేసేవారు. 2019 ఫిబ్రవరికి సంబంధించి వార్షిక ఇంక్రిమెంటు ఇచ్చేందుకు రాధిక నుంచి శేషపద్మజ రూ.5వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆమె.. కడప ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో 2019 ఆగస్టు 27న రూ.5వేలు లంచం తీసుకుంటూ శేషపద్మజ రెడ్హ్యాండెడ్గా దొరికారు. అప్పటి ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో పద్మజను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో పద్మజ (ప్రస్తుతం రిటైరయ్యారు)కు జైలుశిక్ష, జరిమానా విధించారు. ఇందులో రాధికకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఏసీబీ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు.