కొండపల్లి బొమ్మల పండుగ ప్రారంభం
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:59 AM
కొండపల్లి బొమ్మల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రపంచ హెరిటేజ్ డే సందర్భంగా...
హెరిటేజ్ ట్రెక్కింగ్తో ఉత్సవాలకు శ్రీకారం
ఇబ్రహీంపట్నం(విజయవాడ), ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కొండపల్లి బొమ్మల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రపంచ హెరిటేజ్ డే సందర్భంగా పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ సమీపంలో ఈ పండుగను ప్రారంభించారు. తొలిరోజు కొండపల్లి ఖిల్లాపైకి హెరిటేజ్ ట్రెక్కింగ్ జరిగింది. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని మూడు రోజుల వేడుకలను ప్రారంభించారు. కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ వద్ద టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబు జ్యోతి వెలిగించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం కొండపల్లి బొమ్మల స్టాల్స్ను సందర్శించారు. బొమ్మల తయారీ విధానాన్ని పరిశీలించి కళాకారులతో మాట్లాడారు. ‘కొండపల్లి బొమ్మ, ఖిల్లా మన వారసత్వ సంపద. వాటిని ఆదరించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఏటా ఏప్రిల్ 18న ఈ పండుగను నిర్వహించుకుందాం’ అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ... తొలి ప్రయత్నం విజయవంతమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఏటా బొమ్మల పోటీలు నిర్వహించి మొదటి 10 స్థానాల్లో నిలిచిన కళాకారులు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున, మొత్తం రూ.5 లక్షలు బహుమతిగా అందిస్తామని పేర్కొన్నారు.