నేటి నుంచి కొండపల్లి బొమ్మల పండుగ
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:32 AM
కొండపల్లి బొమ్మల పండుగకు సర్వం సిద్ధమైంది. ఈ బొమ్మలకు దేశ విదేశాల్లో ఉన్న ప్రాచుర్యాన్ని మరింత పెంచేందుకు 3 రోజులపాటు ..
మూడు రోజుల పాటు నిర్వహణ
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కొండపల్లి బొమ్మల పండుగకు సర్వం సిద్ధమైంది. ఈ బొమ్మలకు దేశ విదేశాల్లో ఉన్న ప్రాచుర్యాన్ని మరింత పెంచేందుకు 3 రోజులపాటు నిర్వహించనున్న ‘కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్-2026’ శనివారం ప్రారంభంకానుంది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు కొండపల్లి బొమ్మల పండుగ (మేళా)ను నిర్వహించనున్నారు. శనివారం ఉదయం కొండపల్లి ఖిల్లాపైకి హెరిటేజ్ వాక్తో పాటు ట్రెక్కింగ్, బొమ్మల ఎగ్జిబిషన్, మేళా నిర్వహిస్తారు. సాయంత్రం తోలు బొమ్మలాటలు, కీలు గుర్రాలు వంటి సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. కొండపల్లి బొమ్మల పండుగలో భాగంగా సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖ గాయకులు ఎస్పీ చరణ్, సునీతతో సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేశారు.