రాయల రత్నాలు.. కొండపల్లి బొమ్మలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:19 AM
కొండపల్లి బొమ్మలు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి రత్నాలని, ఆనాడు రాయల వారు రత్నాలను రోడ్ల మీద పోసి అమ్మితే నేడు కొండపల్లి బొమ్మలు రోడ్ల మీద పెట్టి అమ్మేటటువంటి చారిత్రక ప్రాంతం...
ముగింపు సభలో పర్యాటక మంత్రి దుర్గేశ్
కొండపల్లి బొమ్మల పండుగ గ్రాండ్ సక్సెస్
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కొండపల్లి బొమ్మలు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి రత్నాలని, ఆనాడు రాయల వారు రత్నాలను రోడ్ల మీద పోసి అమ్మితే నేడు కొండపల్లి బొమ్మలు రోడ్ల మీద పెట్టి అమ్మేటటువంటి చారిత్రక ప్రాంతం కొండపల్లి అని రాష్ట్ర టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 18 నుంచి 20 వరకు కొండపల్లి బొమ్మల పండుగ జరుగుతుందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు పర్యాటకశాఖ, ఎన్టీఆర్ జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ జిల్లా అధికార యంత్రాంగం, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మూడు రోజుల పాటు నిర్వహించిన కొండపల్లి బొమ్మల పండుగ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మూడు రోజుల్లో సుమారు 30 వేలకు పైగా కొండపల్లి బొమ్మల పండుగకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. కొండపల్లి పర్యాటక అభివృద్ధికి చేయూత నివ్వాలని మంత్రి దుర్గేశ్ను కోరారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.