గొడ్డలి పార్టీ వస్తే రాష్ట్రం నాశనమే: పార్థసారథి
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:31 AM
‘గొడ్డలి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ర్టానికి వినాశం తప్పదు. రాబోయే కాలంలో మళ్లీ కూటమి పార్టీలు రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రావా’లని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
ఏలూరు, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ‘గొడ్డలి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ర్టానికి వినాశం తప్పదు. రాబోయే కాలంలో మళ్లీ కూటమి పార్టీలు రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రావా’లని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండేళ్ల కూటమి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీని గొడ్డలి పార్టీ అని ఎందుకంటున్నారో వివరించారు. ‘సీఎం చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేయాలంటే అన్నీ ఆలోచిస్తారు. దానికి విరుద్ధంగా వైసీపీ ఓడిపోయిన తర్వాత.. తెనాలిలో గంజాయితో హల్చల్ చేసే ఇద్దరు యువకులను పోలీసులు దండిస్తే.. వారి దగ్గరకు జగన్మోహన్రెడ్డి వెళ్లి.. మన ప్రభుత్వం వస్తుందని.. నేను చూసుకుంటానంటూ భుజం తట్టారంటే అది గొడ్డలి పార్టీ కాక ఏమంటారో.. ఆలోచించండి’ అని మంత్రి కొలుసు ధ్వజమెత్తారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఈ రోజు మనమంతా ప్రశాంతంగా కూర్చొగలిగామంటే కూటమి అధికారంలోకి రావడమే. 175 సీట్లకు 164 మందిని గెలిపించారంటే అది ప్రజల నమ్మకం. ఈ నమ్మకం నిలబెట్టుకోవడానికి ఈ సభను నిర్వహించాం. ఏలూరు జిల్లాలో వ్యవసాయం టాప్లో ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి అంశాల్లో ఐదో స్థానంలో ఉన్న ఏలూరు జిల్లాను మూడో స్థానంలో నిలబెట్టేలా సమష్టిగా పనిచేయా’లని పిలుపునిచ్చారు.