Excise Department: షాపులు, బార్లలో ఒకేలా మద్యం ధరలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:38 AM
బార్ పాలసీలో కీలక మార్పు తీసుకొచ్చినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
బార్ పాలసీలో కీలక మార్పు.. ఏఆర్ఈటీ రద్దు: ఎంకే మీనా
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): బార్ పాలసీలో కీలక మార్పు తీసుకొచ్చినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్కుమార్ మీనా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను రద్దు చేసినట్లు తెలిపారు. ఇది బార్ల లైసెన్సీలకు పెద్ద ఊరటగా పేర్కొన్నారు. ఇకపై బార్లకు, మద్యం షాపులకు సరఫరా చేసే మద్యం ధరలు ఒకేలా ఉంటాయని తెలిపారు. కాగా, దీనిపై ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీచేసిన రోజు నుంచే నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
మద్యం సీసాలపై ‘లిన్’
మద్యం సీసాలపై కొత్తగా లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్(లిన్)ను తీసుకొచ్చేందుకు రూల్స్కు సవరణ చేస్తూ ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. లిక్కర్, బీరు, వైన్ రూల్స్కు సవరణలు చేసింది. ఇకనుంచి ప్రతిసీసాపై ఏపీ, బ్రాండ్, బ్యాచ్, లైన్, తేదీ, మిల్లీ సెకన్లతో సహా సమయాన్ని కోడ్ రూపంలో ముద్రిస్తారు. దీనివల్ల నకిలీ మద్యం సీసాలను వెంటనే గుర్తుపట్టొచ్చని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.